సమాధానం: శ్రీ ఆంజనేయస్వామి అందరికీ ఆదర్శమూర్తి, ఆరాధ్యుడు. పరమపదముకంటే శ్రీరామపాదమునే నిరంతరం సేవించాలని, ఆయన నేటికీ హిమాలయాల్లో తపస్సులో మునిగి ఉన్నాడట. ఆయన హృదయంలో రాముడే నిత్యనూతనంగా కొలువు ఉంటాడు.
హనుమ గురించి సమగ్రంగా తెలుసుకోవాలంటే హనుమాన్ చాలీసా బాగా అధ్యయనం చెయ్యండి. శ్రీవాల్మీకి రామాయణం విశేషార్థాలతో చదవండి.
దేవతలు హనుమను ఇలా ప్రశంసించారు. "ఓ వానరేంద్రా! నీలా ఎవరికైతే ధైర్యం, పూనిక, గమ్యంపై దృష్టి, వివేకం యుక్తి సామర్థ్యం ఉంటాయో వారు తమ కార్యంలో విజయం సాధిస్తారు".
ఆంజనేయుడు వేదాలు చక్కగా నేర్చినవాడని, సంభాషణలో నిపుణుడని శ్రీరామునిమాట. అందుకే హనుమను జీవాత్మ (సీతను), పరమాత్మను (శ్రీరాముడు) కలిపే ఆచార్యునిగా పెద్దలు పేర్కొంటారు.
ఈ లోకంలో రామభక్త హనుమాన్ గానే ఉండాలని ఆయన కోరుకుంటాడు.
శుభంభూయాత్
సమాధానం: అహింసా ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహః సర్వభూతదయాపుష్పం, క్షమాపుష్పం విశేషతః జ్ఞానపుష్పం, ధ్యానపుష్పం తదైవచ సత్యమష్టవిధం పుష్పం, విష్ణోఃప్రీతికరం భవేత్ అని పెద్దల సూక్తి. విష్ణువుకు ప్రీతికరం అయిన పుష్పాలు భక్తుని సద్గుణాలే. వీటితో ఆ హరిని పూజించమంటున్నారు. ఆ విశిష్ట పుష్పాలు ఇవి. 1-అహింస, 2-ఇంద్రియ నిగ్రహం, 3-సర్వభూత దయ, 4-క్షమ (ఓరిమి), 5-జ్ఞానము, 6-తపము, 7-ధ్యానం, 8-సత్యం. ఈ ఎనిమిది మనం అలవరచుకొని ఆచరణలో పెట్ట గలిగితే, శ్రీహరిని భక్తితో పూజించినట్లే. అందుకే శ్రీ శంకరభగవత్పాదులు కూడా పరమాత్మను నీ మనసు అనే పూవుతో అర్చించమన్నారు. ఇన్ని సద్గుణాలు అలవరచుకొని, భగవంతుని మనసారా భక్తితో అర్చిస్తే జీవితం ధన్యం అవుతుంది. భగవంతుడు ఆనందించి మనల్ని ఆదరిస్తాడు. శుభం భూయాత్
Comments
Post a Comment