ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

ధర్మసందేహం - సమాధానం లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

స్మృతులు 18 అంటున్నారు. అవేమిటో తెలియజేస్తారా? ఇవిగాక ధర్మ శాస్త్ర విషయాలను వివరించే గ్రంథాలేమున్నాయి?

 సనాతన ధర్మాన్ని సూత్రీకరించే మూల స్మృతులు 18. వాటి పేర్లు ఇవి. 01. మనుస్మృతి, 02. బృహస్పతి స్మృతి, 03. వశిష్ఠ స్మృతి, 04. కశ్యప స్మృతి, 05. భారద్వాజ స్మృతి, 06. గౌతమ స్మృతి, 07. యాజ్ఞవల్క్య స్మృతి, 08. భృగు స్మృతి, 09. నారద స్మృతి, 10. కపిల స్మృతి, 11. పరాశర స్మృతి, 12. వ్యాస స్మృతి, 13. కాత్యాయన స్మృతి,   14. ఆపస్తంభ స్మృతి, 15. అశ్వలాయన స్మృతి, 16. కణ్వ స్మృతి, 17. అత్రి స్మృతి, 18. హరీత స్మృతి. ఇవి గాక శంఖ స్మృతి, మున్నగు స్మృతులు,   ఉప స్మృతులు కూడ ఉన్నాయి. ఈ స్మృతులననుసరించి కూర్చబడిన ధర్మశాస్త్ర గ్రంథాలు ఇవి. 01. హేమాద్రి, 02. నిర్ణయ సింధువు, 03. ధర్మ సింధువు, 04. ధర్మ ప్రవృత్తి, 05. స్మృతి రత్నాకరం, 06. స్మృతి రత్న మహోదధి, 07. స్మృతి చంద్రిక, 08. షట్కర్మ చంద్రిక, 09. యల్లాజీయము, 10. సుధీవిలోచనము మున్నగునవి.

ఆలయాల్లో మూలవిరాట్టుగాక ఇంకా అనేక విగ్రహాలను చూస్తున్నాం. అవన్నీ ఏమిటో, ఎందుకో వివరించండి

ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయాల్లో ఉన్న విగ్రహమూర్తులను "షడ్ బేరములు" అని అంటారు. అవి ధృవబేరము (మూర్తి), కౌతుక బేరము, స్నపన బేరము, బలిబేరము, యాత్రాబేరము, శయన బేరములు. గర్భగుడిలో ఉండే మూలవిరాట్టునే ధృవ (కదలిక లేని) బేరము అంటారు. ధృవ బేరం పరిపూర్ణ తేజస్సు కలిగి సకల కళాపూర్ణంగా ఉంటుంది. స్నపన బేరం నిత్యమూ అభిషేకానికి ఉపయోగిస్తారు. నివేదన అయిన తర్వాత, బలిహరణ్ నివేదనను ధ్వజ స్తంభం దగ్గర, బలిపీఠాల దగ్గర, పరివార దేవతలకు తప్పకుండా పెట్టాలి. అప్పుడు పల్లకీలో వెళ్ళే దేవుడిని బలిబేరం అంటారు. ఆలయంలో, గ్రామ వీధుల్లోను ఊరేగింపుగా తీసుకు వెళ్ళే విగ్రహమూర్తులను యాత్రాబేరం అంటారు. నిత్యమూ పవళింపు సేవ చేయడానికి వినియోగించే మూర్తిని శయన బేరం అంటారు. కౌతుకబేరాన్ని మధ్యవర్తిగా వినియోగిస్తారు. అంటే తిరుమంజనం (స్నానం) సమర్పించే ముందు ధృవ బేరంలోని కళాశక్తిని కౌతుక బేరం ద్వారా స్నపన బేరంలో ప్రవేశింపజేసి, ఆ ఉపచారం పూర్తి కాగానే ఆ శక్తిని తిరిగి కౌతుక బేరం ద్వారానే ధృవమూర్తిలోకి మారుస్తారు. ఇలాగే ఇతర ఉపచారాల్లో కూడ చేస్తారు. అయితే సాధారణంగా ఎంత చిన్న ఆలయంలో అయినా ధృవమూర్తి, ఉత్సవమూర్తులు తప్పక ఉంటారు.

దేవాలయంలోని పూజారులు పై వస్త్రాలను ధరించరు. ఎందుకని? కేవలం పంచె మాత్రమే ధరించటంలో ఉన్న ఆంతర్యం ఏమిటి?

 దేవుడి సన్నిధిలో ఆడంబరమైన వస్త్రధారణ చేయరాదని శాస్త్ర నియమం. సామాన్యంగా అర్చకులు పైన ధరించే ఉత్తరీయం అంచులు మొదలైన అలంకారాలతో కొంచెం ఆడంబరంగా ఉంటుంది. అది త్రిజగత్ ప్రభువైన దేవుడి దగ్గర వినయ ప్రవర్తనకు అనుకూలం కాదు. అందువల్ల పై ఉత్తరీయాన్ని నడుముకి చుట్టుకుని పూజాదులు చేయటం ఒక వినయ సంప్రదాయంగా ఏర్పడింది. ఇది దక్షిణ భారతంలో మరీ ఎక్కువ. చలి ఎక్కువగా ఉండే ఉత్తరదేశంలో ఈ ఆచారం లేదు. మన దేశంలో గూడా చలికాలంలో దేవ సన్నిధిలో ఉత్తరీయం ధరించవలసి వస్తే, దుప్పటి కప్పుకున్నట్లు కాక యజ్ఞోపవీతం వేసుకున్నట్లుగా, వల్లెవాటుగా, ఉత్తరీయాన్ని ధరించాలని ధర్మశాస్త్రాలలో ఉంది.

గరుడపురాణంలో చేసిన కర్మలకు రకరకాల శిక్షలు ఉన్నవి అన్నారు. ఆ శిక్షలు పొందేదెవరు?

దేహం వదిలిన తర్వాత మిగిలేది ఆత్మయే గదా - అంటున్నారు. ఎవరు చెప్పారీ మాట? స్థూలదేహం పోయినా జీవాత్మకు సూక్ష్మదేహం ఉండనే ఉంటుంది. అది యమలోకంలో "యాతనా దేహము" అనబడే స్థూలదేహాన్ని స్వీకరిస్తుంది. ఆ శరీరంతో ఆ లోకంలోని శిక్షలను జీవుడు అనుభవిస్తాడు. ఈ విషయాలు గరుడపురాణంలో కూడా ఉన్నాయి. జాగ్రత్తగా చదివితే కనిపిస్తాయి.

వివాహ సమయంలో సప్తపది అంటారు. దీని పూర్వాపరాలు తెలియజేయండి

 "సఖ్యం సాప్తపదీనం" అనేది ఒక శాస్త్ర సూత్రం. అంటే ఏడడుగులు కలిసి ప్రయాణం చేస్తే వారిద్దరికీ స్నేహం కుదురుతుంది - అని భావం. ఈ సూత్రాన్ని తీసుకుని ఒక్కొక్క అడుగులో ఒక్కొక్క దేవతను, ఒక్కొక్క సంకల్పాన్ని జోడించి, వధూవరులిద్దరి చేత సంయుక్తంగా ఏడడుగులు వేయించే వేదోక్త ప్రక్రియే సప్తపది.

నవగ్రహాలను శుభ గ్రహాలు, పాప గ్రహాలు అని ఎందుకు విభజించారు?

 నవ గ్రహ దేవతలందరూ పవిత్రులే. వీరు స్వయంగా ఎవరికీ ఏ శుభ ఫలితాలనూ ఇవ్వరు. ఆయా జీవులు గత జన్మలలో చేసుకున్న పాపపుణ్యాల ఫలితంగా ఈ జన్మలో రాబోతున్న ఫలితాలను సూచిస్తారు - అంత మాత్రమే. పాప ఫలితాలను సూచించే గ్రహాలను పాపగ్రహాలనీ, పుణ్యఫలితాలను సూచించే గ్రహాలను శుభగ్రహాలనీ, ప్రాయశ్చిత్త కర్మలను నిర్ణయించే సౌకర్యం కోసం మాత్రమే విభజించారు. గ్రహ జపాదులన్నీ ప్రాయశ్చిత్త కర్మలే.

రామకోటి రాయడానికి నియమాలు | ధర్మ సందేహాలు - సమాధానాలు

    రామకోటి రాయడానికి నియమాలు | ధర్మ సందేహాలు - సమాధానాలు By Sri Hanuman Astrology నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు శ్రీహనుమాన్ జ్యోతీషాలయం జ్యోతీషం మరియు ఆధ్యాత్మిక నిలయం. Sri Prasannanjaneya Swami Temple Venkataramaiah Colony Medchal Rangareddy - 501401  

ప్రేమకు, భక్తికి సంబంధం

పరమాత్మపై పరమ ప్రేమ రూపమైనదే భక్తి అని దేవర్షి నారదుని నిర్వచనం. ఆ మహర్షి రచించిన 84 భక్తి సూత్రాలు, వాటిపై వ్యాఖ్యానం ప్రేమ రూపమైన భక్తిని గురించే కావడం విశేషం. భక్తి అంటే ఏమిటి? భగవంతునిపై అనన్యరూపమైన ప్రేమ కలిగి ఉండడమే భక్తి. అది కర్మ, జ్ఞానం మొదలగు వాని ఆశ్రయం లేకుండా ఉండాలి. ఇతర విషయాలపై స్పృహ లేకుండా చిత్తం అనన్య భావంతో కేవలం భగవంతుని పైనే లగ్నం కావాలి. ఇహ లోకంలోని సమస్త సుఖాల నుండి, పరలోకంలోని సమస్త సుఖాల నుండి దూరమైనా, చివరకు భగవానుని పైననే లగ్నమైన చిత్త వృత్తి ఉండాలి. ఇతర పదార్థాలపై గల మమతల నుండి, ఆసక్తుల నుండి మరలి సర్వ కాల సర్వావస్థల్లో సకల కల్యాణకరుడైన, ప్రియతముడైన భగవానుని పైనే హృదయం నిలపాలి. దానినే అనన్య ప్రేమ అంటారు. "అమృత స్వరూపాచ" అంటారు మూడవ భక్తి సూత్రంలో నారద మహర్షి. అటువంటి అనన్య ప్రేమ అమృత స్వరూపమైనది. ఈ ప్రేమామృతం లభించిన భక్తుడు, దానిని త్రాగి అమరుడవుతాడు. లౌకిక వాసనలే (సంస్కారాలే) మృత్యువు. భక్తుని హృదయంలో నిత్య నూతనమైన పవిత్ర ప్రేమ సంస్కారం తప్ప మరి ఒకటి ఉండదు. ఈ సంస్కారబలంతో భగవానుని లీలానుభవాన్నే సాధనంగా చేసుకొని భక్తుడు జనన్ మరణ సంసార చక్రము నుండి...

ఆలయాలలో, దేవుని సన్నిధిలో ఇతరులకు నమస్కారం పెట్టరాదంటారు, ఎందువల్ల?

దేవుడు, సద్గువులైన యతీశ్వరులు, ఇలాంటి వారు త్రిజగత్ప్రభువులు. వారి సన్నిధిలో ఇతరులంతా దాసులే. చక్రవర్తి సన్నిధిలో ఉండగా, దాసుల దృష్టి చక్రవర్తి మీద కేంద్రీ కృతం కావాలి గానీ, పక్కనున్న దాసుల మీద కాదు. పక్కనున్న దాసుల మీద దృష్టి పెట్టి వారిని గౌరవించడం చక్రవర్తికి అవమానం చేసినట్లే అవుతుంది. దైవ సన్నిధిలో ఇతరులకు నమస్కారం చేయటం గూడా అలాంటిదే. అందువలన దానిని ధర్మశాస్త్రాలు నిషేధించాయి.  

మంత్రజపం విశేష సంఖ్యలో చేస్తున్నప్పుడు, మూత్ర విసర్జన సమస్య వచ్చినపుడు, తప్పనిసరిగా స్నానంచేసి, జపాన్ని కొనసాగించవలసినదేనా?

సమాధానమ్:   మూత్ర విసర్జన చేసినపుడు స్నానాన్ని ఏ శాస్త్రకారుడూ విధించలేదు. శాస్త్రంలో లేని ఆచారాలను సృష్టించుకోవడం సముచితం కాదు. జపదీక్ష ప్రధానమైనపుడు, వయో భారాదులవల్ల మూత్ర విసర్జనాదులు మళ్ళీ మళ్ళీ సంభవిస్తుంటే, మనస్సును మంత్ర దేవత మీద నుంచీ మళ్ళనీయకుండా జాగ్రత్త పడుతూ, పాద ప్రక్షాళన ఆచమనాలను ఆచరించి, వెంటనే జపంలోకి ప్రవేశించటమే శాస్త్ర సమ్మతం.

వాసుదేవుడు ద్వాపర యుగం వాడైతే, కృతయుగంలోనే ధృవుడు వాసుదేవ మంత్రాన్ని ఎలా జపించాడు? వివరించండి.

సమాధానం:     వాసుదేవ అనే శబ్ధానికి రెండర్థాలున్నాయి.   వసుదేవ పుత్రుడు,   వస్-అంతటా ఉండువాడు, దివి-ప్రకాశించువాడు, తేజోరాశి-వాసుదేవుడు. మొదటి అర్థం శ్రీకృష్ణుడు అవతరించిన తర్వాత వచ్చింది. రెండవ అర్థం ఎప్పటి నుండో ఉంది. వేదమే ఆ నామాన్ని గాయత్రిలో చేర్చుకుంది. ఆ నామాన్నే నారదుడు ధృవుడికి ఉపదేశించాడు. ఆ పేరు కృష్ణునికి వచ్చింది. అసలు శ్రీకృష్ణనామం కూడ కృష్ణుడు అవతరించక మునుపే వేదంలో వరాహావతారాన్ని తెలుపుతూ ఉంది. భూదేవి ప్రార్థనలో ఉద్ధృతాసి వరాహేణ కృష్ణేన శత బాహునా ఓ భూమీ! నీవు అనేక చేతులు గల కృష్ణుడగు వరాహస్వామిచే ఎత్తబడితివి. ఇక్కడ కృష్ణుడంటే పూర్ణ ఆనంద ప్రదుడు అని అర్థం. ఒక ధర్మ సూక్ష్మాన్ని నలుగురూ తెలిసికొనేలా చేసింది మీ పరి ప్రశ్న. సంతోషం.

దేవుడున్నాడని నమ్మే నన్ను దేవుడు లేడని హేతువాదులు నమ్మింపజూస్తున్నారు. ఏది నమ్మాలో తోచక నిద్రపట్టడం లేదు. ఏం చెయ్యమంటారు?

సమాధానం: దేవుడు లేడనే ఆలోచన మనిషిలో అభద్రతా భావాన్ని కలిగించి, ఉన్న కాస్త మనశ్శాంతిని పోగొడుతుంది. అన్నం తిననివ్వదు, నిద్రపోనివ్వదు, ఏ పనీ ఏకాగ్రతతో చెయ్యనివ్వదు. సాటి మనిషిని చూచినా ఏదో రాక్షసిని చూచినట్లుంటుంది. ఇలా ఉండేది అంతరాత్మ, నిజాయితీ ఉన్న మనబోటి వాళ్ళకే. అదే, మనల్ని నడిపించే ఏదో దివ్యశక్తి విశ్వమంతా నిండి ఉంది. మనలోనూ అంతర్యామిగా ఆ దివ్యతేజం ఉంది. అదే నన్ను సన్మార్గంలో సత్ కృషిలో పెట్టి నన్ను దీవిస్తుంది అనుకుంటే, మీ జీవితానికి ఎంత భద్రత, ఎంత రక్షణ, ఎంత నిర్భీతి, ఎంత ధీమా, ఎంత ఆత్మగౌరవం, ఎంత అభివృద్ధి, ఎంత ప్రేయము, ఎంత శ్రేయము, ఎంత నిశ్చింత కలుగుతుందో చూశారా. దేవుడు ఉన్నాడు అనుకునేవాడే జీవించి ఉన్నట్లని, దేవుడు లేడన్న వాడు అన్నీ లేనివాడేనని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. దైవభక్తి, పాప భీతి ఉన్నవాడు మంచివాడుగా ఉండాలని ఎప్పుడూ ప్రయత్నిస్తూంటాడు. సాటి మనుషుల్లో దైవాన్ని చూస్తూ, సమాజసేవ చేస్తాడు. నలుగిరిలోనూ, తాను చేసే పనిలోనూ మంచిపేరు తెచ్చుకొని తన జీవితాన్ని సార్థకం చేసుకుంటాడు. ఇప్పుడు మీరు చెయ్యవలసిందల్లా ఒక్కటే. మీ ఇలవేల్పును ఇంటిలోను, మీ హృదయంలోనూ ప్రతిష్ఠించుకొని, రోజూ ఉదయం న...

గోవింద అనే పేరు కలియుగంలో కదా వచ్చింది. అయితే ద్వాపరయుగంలో ద్రౌపది గోవిందా అని ఎలా అనగలిగింది?

సమాధానం:  గోవింద అనే నామం శ్రీకృష్ణుడికి మొదట వరాహావతారంలో భూదేవిని ఉద్ధరించినపుడు తర్వాత ద్వాపర యుగంలోను వచ్చింది. తనకు హోమ హవిస్సులు ఇవ్వలేదనే కోపంతో, ఇంద్రుడు గోకులంలో రాళ్ళవాన కురిపించి అందరినీ భయభ్రాంతుల్ని చేస్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు గోవర్థన పర్వతం చిటికెన వ్రేలితో గొడుగుగా ఎత్తి, ఆ బాలగోపాలానికి ఆశ్రయం కల్పిస్తాడు. ఏడు రోజుల తర్వాత ఇంద్రుడు తన తప్పు తెలుసుకొని, కామధేనువుతో కృష్ణుడి వద్దకు వచ్చి, క్షీరాభిషేకం చేస్తాడు. గోవులను, గోపాలురను పొంది ఆనందింపజేసినవాడుగా శ్రీకృష్ణుడికి గోవింద పట్టాభిషేకం జరుగుతుంది. అప్పటి నుండి ఆయన గోవిందుడయ్యాడు. ఆ తర్వాత ద్రౌపది ఆయన్ను గోవిందా అని పిలిచి శ్రీకృష్ణుని నుండి రక్షణ పొందుతుంది. ఆ గోవిందనామంతోనే కలియుగ దైవమైన శ్రీవేంకటేశ్వరుని భక్త కోటి ప్రేమతో, ప్రపత్తితో భజిస్తున్నారు. ఎలుగెత్తి గోవిందా, గోవిందా అంటున్నారు. గోవిందా గోవింద

స్ఫటికమాల, తులసి మాల ధరించడం వల్ల ప్రయోజనం ఏమిటి? సుమంగుళులు ఇవి ధరించవచ్చా?

సమాధానం:   ఈ మాలలు శరీరాన్ని, మనస్సును పవిత్రం చేస్తాయి. తులసిమాలలు రక్తప్రసరణను క్రమబద్ధం చేస్తాయి. మనస్సుకు శాంతిని, ఏకాగ్రతను ప్రసాదిస్తాయి. విష్ణువుకు ప్రీతికరం అయిన తులసి ధరిస్తే మనకు ఆ స్వామి మీద ప్రీతి అధికమవుతుంది. స్ఫటికం కూడా గుండెను, దేహాన్ని ప్రసన్నంగా ఉంచేదే.   అయితే ఈ మాలలు ఎప్పుడూ అపవిత్రం కాకుండా చూసుకోవాలి. వయసులో పెద్ద వారైన, ముని పత్నుల వంటి వారు ఈ మాలలు ధరించవచ్చు. సుమంగుళులకు మంగళ సూత్రమే ప్రధానం.

అహింసా ప్రథమం పుష్పం అనే శ్లోకం పూర్తిగా వ్రాసి, వివరించండి.

సమాధానం:   అహింసా ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహః సర్వభూతదయాపుష్పం, క్షమాపుష్పం విశేషతః జ్ఞానపుష్పం, ధ్యానపుష్పం తదైవచ సత్యమష్టవిధం పుష్పం, విష్ణోఃప్రీతికరం భవేత్ అని పెద్దల సూక్తి. విష్ణువుకు ప్రీతికరం అయిన పుష్పాలు భక్తుని సద్గుణాలే. వీటితో ఆ హరిని పూజించమంటున్నారు. ఆ విశిష్ట పుష్పాలు ఇవి. 1-అహింస, 2-ఇంద్రియ నిగ్రహం, 3-సర్వభూత దయ, 4-క్షమ (ఓరిమి), 5-జ్ఞానము, 6-తపము, 7-ధ్యానం, 8-సత్యం. ఈ ఎనిమిది మనం అలవరచుకొని ఆచరణలో పెట్ట గలిగితే, శ్రీహరిని భక్తితో పూజించినట్లే. అందుకే శ్రీ శంకరభగవత్పాదులు కూడా పరమాత్మను నీ మనసు అనే పూవుతో అర్చించమన్నారు. ఇన్ని సద్గుణాలు అలవరచుకొని, భగవంతుని మనసారా భక్తితో అర్చిస్తే జీవితం ధన్యం అవుతుంది. భగవంతుడు ఆనందించి మనల్ని ఆదరిస్తాడు. శుభం భూయాత్

నాకు ఈ జన్మలోనే ఆత్మదర్శనం, దైవదర్శనం, మోక్షం సంపాదించాలని ఉంది. నేనేం చేయాలి?

సమాధానం:   ప్రతి ఒక్కరూ కోరుకోదగినది, చేరుకోవలసినది ఇదే. ముందు సత్పురుష సాంగత్యం చేయండి. ఒక సత్సంగంలో చేరండి. శమదమాది గుణాలు అలవరచుకోండి. ఒక సద్గురువును ప్రసాదించమని మీ కులదైవాన్ని ప్రార్థించండి. సద్గురువులంటే కేవలం దర్శనం మాత్రం ఇచ్చే దర్శన గురువులు కాదు. ఆర్భాటం ప్రదర్శించి డబ్బులు గుంజుకునే ప్రదర్శన గురువులు కాదు. ఏం చెయ్యాలో చెప్పకుండా మాయమాటలు చెప్పే మాయాగురువులు కాదు. ముందు తాము ఆచరించి, తర్వాత శిష్యులకు చెప్పి, చేయించే సదాచార్యులనే ఆశ్రయించండి. వారు తత్త్వదర్శనులు, మార్గదర్శకులు అయి ఉంటారు. ఒకసారి దైవానుగ్రహంతో సదాచార్యులు లభించాక, ఇక మీ భారమంతా ఆయనపై ఉంచి, నడుచుకోవడమే మీరు అనుకున్న ఉన్నత లక్ష్యాలను చేరుకునే ఏకైక మార్గం.

ఆత్మకు పుట్టుకలేదు, చావులేదు అంటారు కదా, మరికొత్త ఆత్మలు సృష్టించడబడకపోతే, ప్రపంచ జనాభా ఎలా పెరిగిపోతున్నది?

సమాధానం: భారతదేశం వంటి కొన్ని దేశాల్లోనే మానవుల సంఖ్య పెరిగిపోతున్నది. కాని జంతుజాలము తరిగిపోతున్నది. క్రిమికీటకాలు ఎంత వేగంగా పెరుగుతున్నాయో అంత వేగంగానే నశించిపోతున్నాయి. వృక్షాలు, పక్షులు తగ్గిపోతున్నాయి. మనం చేసే కర్మలను బట్టి మనకు జన్మలు లభిస్తాయి. పుణ్యకర్మలు చేస్తే దివ్యపురుషులుగా ఉత్తమలోకాలకు వెళ్తారు. పాపకర్మలు చేస్తే అథో జన్మలు అంటే పాములు, కీటకాలు, మృగాలు వంటివి వస్తాయి. అందువల్ల ఒక జీవ వర్గంలో సంఖ్య ఎక్కువైతే, ఇంకొక దానిలో జనాభా తగ్గిపోయే అవకాశం ఉన్నది. అందువల్ల ఆత్మల సంఖ్య పెరిగే అవకాశంలేదు. అన్ని జీవవర్గాల మధ్య సమతుల్యాన్ని ఆ భగవానుడే నిర్వహిస్తాడు. మనం చేయవలసినదల్లా, మాధవసేవగా సర్వ ప్రాణి కోటి సేవ చేస్తూ, భగవంతుని కరుణా కటాక్షాలకు నోచుకోవడమే.

మహాభాగవతంలో రాధ పాత్రలేదంటారు. మరి ఎక్కడ ఉందో చెప్పండి.

సమాధానం:   నిజమే, భాగవతంలో రాధ లేదు. శ్రీకృష్ణుని భార్యగా రుక్మిణీ దేవికే మనం పట్టంకడతాం. తమిళ సంప్రదాయంలో నీళాదేవి (నప్పిన్న) శ్రీకృష్ణుని పట్టపుదేవి. అయితే ఉత్తరాది అంతటా రాధకే హారతి పడతారు. రాధేశ్యాం అంటూనే ఒకరినొకరు పలకరించుకోవడం అక్కడి ప్రజలకు అలవాటు. రాథే రాథే అంటూ వారు తన్మయులై భజనలు చేస్తారు. బ్రహ్మవైవర్త పురాణంలో రాధ ప్రస్తావన ఉంది. ద్వాపర యుగంలో రాక్షసరాజులు చాలామంది ప్రజలను పీడిస్తూ ఉంటే భూమాత భరించలేక బ్రహ్మతో మొరపెట్టుకుంది. అప్పుడు బ్రహ్మ భూదేవిని, మహేశ్వరుని, నారాయణుని వెంటపెట్టుకుని గోలోకం వెళతాడు. అక్కడ రాసమండలంలో రాధతో విహరిస్తున్న శ్రీకృష్ణ పరమాత్మను దర్శించి, స్తుతిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడే అందరికీ చిరునవ్వుతో అభయమిచ్చి తాను ద్వాపరాంతంలో గోకులంలో అవతరిస్తానని, అలాగే దేవతలందరూ గోపాలురుగా, యాదవులుగా జన్మిస్తారని, వృషభానుని కుమార్తెగా రాధ, మహాలక్ష్మి భీష్మకుని పుత్రిక రుక్మిణిగా జన్మిస్తారని చెపుతాడు. ఇదీ బ్రహ్మవైవర్త పురాణంలోని రాధాకృష్ణుల గాథ. భాగవతంలో రాధ ఊసేలేదు. జైశ్రీకృష్ణ

ముప్పది మూడు కోట్ల మంది దేవతలంటారు కదా, వారి వివరాలు ఏమిటి?

సమాధానం:   "లెక్కలేనంతమంది" అని చెప్పడానికే, ముప్ఫై మూడు కోట్ల దేవతలని, ముక్కోటి దేవతలని అంటారు. అట్లాగే "సహస్ర శీర్ష పురుష" అంటే అసంఖ్యాకమైన తలలు ధరించే శక్తి కలిగిన పురుషోత్తముడనే అర్థం చేసుకోవాలి. కేవలం వెయ్యి తలలు కలిగిన వాడనే అర్థంకాదు. అసలు ముప్పది ముగ్గురు  దేవతలనే వేదం చెప్పింది. అయితే వీరు ముప్ఫై మూడు వర్గాలకు చెందిన అనేకమంది దేవతలు. ఎనిమిది మంది వసువులు, పదకొండుమంది రుద్రులు, పన్నెండు మంది ఆధిత్యులు, ఇద్దరు అశ్వినీ దేవతలు మొత్తం ముప్పది ముగ్గురు. దేవతలకు వైద్యులే అశ్వనీ దేవతలు. అందరు దేవతలకంటే అన్ని విధాల అధికుడైన దివ్యతేజోమూర్తినే దేవుడు అని పిలవాలి.

స్తోత్రానికి, మంత్రానికి తేడా ఏమిటో చెప్పండి?

సమాధానం: భగవత్ స్తోత్రం ఏదైనా భాషా దోషాలు లేకుండా మీకు వచ్చిన, నచ్చిన శైలిలో రాగయుక్తంగానో, ఉత్తవచనంలోనే ఏదో ఒక పద్ధతిలో మనస్సు లగ్నంచేసి చదువుకోవచ్చు. అయితే పురుషసూక్తం వంటి వేదానికి చెందిన స్తోత్రాలను ఇప్పటికే వేద పండితులచే పఠింపబడుతున్న స్వరాలలోనే చదవాలి. వేదమంత్రాలు స్వరం మార్చి చదివితే అపార్థాలు, అనర్థాలు వచ్చే ప్రమాదం ఉన్నది. గాయత్రీ మంత్రం కూడా అలాంటిదే. ఒక్కోదాన్ని బట్టి స్వరం మారుతూ ఉంటుంది. స్తోత్రం ఎంత పెద్దదైనా ఉండవచ్చు, కాని మంత్రం సంపుటి అక్షరాలతో ఓంకారంతో చిన్నదిగానే ఉంటుంది.  ఉదా;- పంచాక్షరి, షడక్షరి, అష్టాక్షరి మొదలైనవి. మంతారంత్రాయతే ఇతి మంత్రః మననం (జపం) చేస్తే రక్షించేదే మంత్రం. మనస్సుకు శాంతిని, దాంతిని, అనన్య భక్తిని, సత్ప్రవర్తనను కలిగించేదే స్తోత్రం. స్తోత్రం గురూపదేశం లేకుండా చదువుకోవచ్చు. కాని మంత్రం గురూపదేశంపొంది, నియమనిష్ఠలతో జపిస్తేనే ఫలితానిస్తుంది.