సమాధానం: మన ఇతిహాస పురాణాల్లోంచి మనం నేర్చుకొని పాటించాల్సినవి ఎన్నో ఉన్నాయి. ఆంజనేయస్వామి సముద్రలంఘనం చేసి, నూరు యోజనాలు దాటి లంక చేరాడు. అలాగే మనం సంసార సాగరాన్ని నూరేళ్ళ ఆయుర్ధాయం లోపల దాటి ఆవలి తీరం చేరాలి. యోగి, సాధకుడు, ఆచార్యుడు అయిన హనుమ తనను తాను రామబాణంతో పోల్చుకున్నాడు. ఇదే కర్మయోగం యొక్క మూలసూత్రం. హనుమ ఈ పనిని తాను చేస్తున్నానని కానీ, ఇది తన కోసమే అని కానీ, ఇది తనది అని కానీ తలవడంలేదు. రామకార్యం కోసం రామబాణంలాగా వెళ్తానంటాడు. ఈ జీవన సూత్రాన్ని మనం పాటించాలి. అంతా నేను, నాది అనే భావం మనలో తగ్గాలి. సముద్రాన్ని దాటడంలో హనుమ నాలుగు అడ్డంకులను ఎదుర్కొన్నాడు. ఏ ఆలంబనము లేకుండా అగాథమైన సాగరాన్ని దాటడం, మైనాకుడి అతిధ్యాన్ని సున్నితంగా తిరస్కరించి ఆగకుండా ముందుకు సాగడం, సురస అనే రాక్షసిని ఉపాయంతో జయించడం, సింహిక అనే ఛాయా రాక్షసిని సంహరించడం ఈ పనుల్ని అవలీలగా చేసిన హనుమను దేవతలు ఇలా మెచ్చుకున్నారు.
యస్యత్వేతాని చత్వారి వానరేంద్ర! యథాతవ
ధృతిర్దృష్టిర్కమతిర్ధాక్ష్యం స్వకర్మ సు నసీదతి
ఓ వానరేంద్రా! నీలా ఎవరికైతే ధైర్యం, పూనిక, గమ్యంపై దృష్టి, వివేకం, యుక్తి, సామర్థ్యం ఉంటాయో అతడు తన పనిలో విజయం సాధిస్తాడు. ఏ కార్యం సాధించాలన్నా మనకు ఉండాల్సిన గుణగణాలే ఇవి. మానవుని జీవితమే రామాయణం. జీవితంలో అడుగడుగునా మనకు పాఠాలు నేర్పే సద్గురువు వాల్మీకి మహర్షి.
శుభంభూయాత్
సమాధానం: అహింసా ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహః సర్వభూతదయాపుష్పం, క్షమాపుష్పం విశేషతః జ్ఞానపుష్పం, ధ్యానపుష్పం తదైవచ సత్యమష్టవిధం పుష్పం, విష్ణోఃప్రీతికరం భవేత్ అని పెద్దల సూక్తి. విష్ణువుకు ప్రీతికరం అయిన పుష్పాలు భక్తుని సద్గుణాలే. వీటితో ఆ హరిని పూజించమంటున్నారు. ఆ విశిష్ట పుష్పాలు ఇవి. 1-అహింస, 2-ఇంద్రియ నిగ్రహం, 3-సర్వభూత దయ, 4-క్షమ (ఓరిమి), 5-జ్ఞానము, 6-తపము, 7-ధ్యానం, 8-సత్యం. ఈ ఎనిమిది మనం అలవరచుకొని ఆచరణలో పెట్ట గలిగితే, శ్రీహరిని భక్తితో పూజించినట్లే. అందుకే శ్రీ శంకరభగవత్పాదులు కూడా పరమాత్మను నీ మనసు అనే పూవుతో అర్చించమన్నారు. ఇన్ని సద్గుణాలు అలవరచుకొని, భగవంతుని మనసారా భక్తితో అర్చిస్తే జీవితం ధన్యం అవుతుంది. భగవంతుడు ఆనందించి మనల్ని ఆదరిస్తాడు. శుభం భూయాత్
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి