సమాధానం:
తిరుచానూరులో కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా తమిళుల కార్తీకమాసంలో పంచమీ తిథి నాదు పుష్కరిణిలో పద్మతీర్థంలో చక్రస్నానం జరుపుతారు. ఈ తీర్థం స్వయంగా శ్రీనివాసుడే ఏర్పాటు చేశాడని ప్రతీతి. తిరుచానూరులో పుష్కరిణికి పద్మపుష్కరిణి అనీ, పద్మతీర్థం అని పేరు. అమ్మవారు పంచమినాడు జన్మించారు.
తిరుమలలో ఆశ్వీయుజ మాసంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో చివరి రోజు స్వామి పుష్కరిణిలో చక్రస్నానం జరుగుతుంది. చక్రాన్ని చక్రత్తాళ్వార్ అని వైష్ణవ సాంప్రదాయంలో సంభావిస్తారు. తిరుమలలో వలె తిరుచానూరులోను కార్తీక బ్రహ్మోత్సవాల చివరి రోజు పద్మావతిదేవి ఉత్సవమూర్తితో పాటు సుదర్శన చక్రాన్ని కూడా ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు వైభవంగా తీసుకొస్తారు.
అదే సమయంలో తిరుమల నుండి శ్రీవేంకటేశ్వరుడు పద్మావతికి జన్మదిన కానుకగా రెండు పట్టుచీరలు, రెండు పట్టు రవికెలు, పసుపు, చందనం ముద్దలు, తులసిమాలలను సారెగా పంపుతారు. ఏనుగు అంబారీపై వాటిని తిరుమల నుండి ఊరేగింపుగా తెస్తారు. వాటిని ఆలయ కార్యనిర్వహణాధికారి సభక్తికంగా స్వీకరించి అమ్మవారికి సమర్పిస్తారు. మధ్యాహ్న సమయంలో వేలాది భక్తులు చక్రంతోబాటు పుష్కరిణిలో స్నానం చేస్తారు.
ఆకాశంలో ఆ సమయంలో ఏటా గరుడపక్షి పుష్కరిణిపై ప్రదక్షిణ చేయడం కళ్ళారా వీక్షించవచ్చు.
శుభంభూయాత్
సమాధానం: అహింసా ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహః సర్వభూతదయాపుష్పం, క్షమాపుష్పం విశేషతః జ్ఞానపుష్పం, ధ్యానపుష్పం తదైవచ సత్యమష్టవిధం పుష్పం, విష్ణోఃప్రీతికరం భవేత్ అని పెద్దల సూక్తి. విష్ణువుకు ప్రీతికరం అయిన పుష్పాలు భక్తుని సద్గుణాలే. వీటితో ఆ హరిని పూజించమంటున్నారు. ఆ విశిష్ట పుష్పాలు ఇవి. 1-అహింస, 2-ఇంద్రియ నిగ్రహం, 3-సర్వభూత దయ, 4-క్షమ (ఓరిమి), 5-జ్ఞానము, 6-తపము, 7-ధ్యానం, 8-సత్యం. ఈ ఎనిమిది మనం అలవరచుకొని ఆచరణలో పెట్ట గలిగితే, శ్రీహరిని భక్తితో పూజించినట్లే. అందుకే శ్రీ శంకరభగవత్పాదులు కూడా పరమాత్మను నీ మనసు అనే పూవుతో అర్చించమన్నారు. ఇన్ని సద్గుణాలు అలవరచుకొని, భగవంతుని మనసారా భక్తితో అర్చిస్తే జీవితం ధన్యం అవుతుంది. భగవంతుడు ఆనందించి మనల్ని ఆదరిస్తాడు. శుభం భూయాత్
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి