మనం మన దృష్టిని సదా ఆ దైవం మీద ఉంచితే మనం సూటిగా ఆయన్ని చేరుకుంటాము. అలా కాక దృష్టిని పక్కవాటి వైపు మళ్ళిస్తే దారి తప్పుతాము. కాబట్టి మన గమ్యం సదా ఆ పరమత్మే అయి ఉండాలి.
మనది పోకూడదు అనుకోవడం లోభం. ఇతరులకు చెందింది మనకు రావాలని కోరుకోవడమే స్వార్థం. ఈ రెండూ మనిషికి ఆధ్యాత్మికంగా చెరుపు చేస్తాయి.
మనలో ఎక్కువమంది బహుమతుల వెంటపడి, దేవుడి వైపు వీపుని పెడుతుంటారు. దేవుడి బహుమతులను కాక, దేవుడిని పొందాలన్నది మన ధ్యేయం అయి ఉండాలి.
బాధపడే వాడిని చూసి సహాయం చేయడానికి పరుగెత్తే కాళ్ళు, అతనికి స్వాంతనని ఇవ్వడానికి చాచే చేతులు, అతని బాధని చూసి దయతో కన్నీళ్ళు కార్చే కళ్ళు, అతని బాధని తగ్గించే విధంగా మాట్లాడే నాలుక గలవాడే నిజంగా దేవుడు ప్రేమించే మనిషి. ఎందుకంటే దేవుడ్ని ప్రేమించే వాడే ఆ విధంగా ప్రవర్తించగలడు. అలాంటి వాడంటేనే దేవుడికి ఇష్టం.
సమాధానం: అహింసా ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహః సర్వభూతదయాపుష్పం, క్షమాపుష్పం విశేషతః జ్ఞానపుష్పం, ధ్యానపుష్పం తదైవచ సత్యమష్టవిధం పుష్పం, విష్ణోఃప్రీతికరం భవేత్ అని పెద్దల సూక్తి. విష్ణువుకు ప్రీతికరం అయిన పుష్పాలు భక్తుని సద్గుణాలే. వీటితో ఆ హరిని పూజించమంటున్నారు. ఆ విశిష్ట పుష్పాలు ఇవి. 1-అహింస, 2-ఇంద్రియ నిగ్రహం, 3-సర్వభూత దయ, 4-క్షమ (ఓరిమి), 5-జ్ఞానము, 6-తపము, 7-ధ్యానం, 8-సత్యం. ఈ ఎనిమిది మనం అలవరచుకొని ఆచరణలో పెట్ట గలిగితే, శ్రీహరిని భక్తితో పూజించినట్లే. అందుకే శ్రీ శంకరభగవత్పాదులు కూడా పరమాత్మను నీ మనసు అనే పూవుతో అర్చించమన్నారు. ఇన్ని సద్గుణాలు అలవరచుకొని, భగవంతుని మనసారా భక్తితో అర్చిస్తే జీవితం ధన్యం అవుతుంది. భగవంతుడు ఆనందించి మనల్ని ఆదరిస్తాడు. శుభం భూయాత్
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి