గ్రహణాల గురించి మన జ్యోతిష పండితులు చెప్పేదొకటయితే, ఆధునిక శాస్త్రవేత్తలు మరొక విధంగా చెప్తున్నారు. ఎవరు చెప్పేది నమ్మాలి?
సమాధానం: ఇద్దరు చెప్పేవీ నమ్మదగినవే.
సూర్య చంద్ర గ్రహణాల గురించి వారిద్దరూ చెప్పే విషయంలో వైరుధ్యం ఏమీలేదు. వేదంలో ఉన్న విజ్ఞానాన్ని బీజరూపంలో ఉన్న కథలనే పురాణాల్లో విశదంగా కథల రూపంలో వివరిస్తారు.
రాహువనే రాక్షసుడు సూర్యుణ్ణి ఆక్రమించి అంధకారంతో కప్పివేస్తే, అత్రి మహర్షి తన మంత్ర, యంత్ర, తంత్ర శక్తులతో సూర్యుణ్ణి మరలా ప్రకాశించేలా చేశాడని ఋగ్వేదంలో ఉంది. ఇదే భాగవత పురాణంలో విశదీకరింపబడినది.
క్షీరసాగర మధనంలో వచ్చిన అమృతాన్ని మోహిని రూపంలో విష్ణువు దేవతలకు పంచుతుంటాడు. రాహువు కామ రూపుడై దేవతల పంక్తిలో కూర్చుంటాడు. ఇది గమనించిన సూర్య చంద్రులు విష్ణువుకు ఉప్పందిస్తే, ఆయన తన సుదర్శన చక్రంతో రాహువు తల ఖండిస్తాడు, తల రాహు గ్రహంగా, మొండెం కేతు గ్రహంగా హరి కరుణతో ఆకాశంలో నిలుస్తారు.
వారికి సూర్య చంద్రులపై ఉన్న ఈ కోపం కారణంగా, అమావాస్య, పౌర్ణమిలలో వారిని గ్రహణాలుగా పట్టుకుంటారని పురాణ కథనం.
మన జ్యోతిషశాస్త్రంలో గ్రహణాన్ని ఉపరాగం అంటారు. భూమి నీడ చంద్రుని కప్పివేసినపుడు చంద్ర గ్రహణము, చంద్రుడు సూర్యుని కప్పి వేసినప్పుడు సూర్య గ్రహణము అని సిద్ధాంత శిరోమణి గ్రంధంలో శ్రీభాస్కరాచార్యులు చెప్పారు.
ఏ పున్నమి నాడు సూర్య చంద్రుల అంశలు భూమికి సమానం అవుతాయో ఆనాడే చంద్ర గ్రహణం.
ఏ అమావాస్య నాడు సూర్య చంద్రుల అంశలు సమానం అవుతాయో ఆనాడే సూర్య గ్రహణం.
సూర్య చంద్రులిద్దరూ తమ పరిధులలో ఉన్నా, అమావాస్య నాడు ఏకరాశిలో చేరుతారు.
అందుకే అమావాస్యను సూర్యేందు సంగమం అంటారు.
శుభంభూయాత్
Comments
Post a Comment