ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

స్మృతులు 18 అంటున్నారు. అవేమిటో తెలియజేస్తారా? ఇవిగాక ధర్మ శాస్త్ర విషయాలను వివరించే గ్రంథాలేమున్నాయి?

 సనాతన ధర్మాన్ని సూత్రీకరించే మూల స్మృతులు 18. వాటి పేర్లు ఇవి. 01. మనుస్మృతి, 02. బృహస్పతి స్మృతి, 03. వశిష్ఠ స్మృతి, 04. కశ్యప స్మృతి, 05. భారద్వాజ స్మృతి, 06. గౌతమ స్మృతి, 07. యాజ్ఞవల్క్య స్మృతి, 08. భృగు స్మృతి, 09. నారద స్మృతి, 10. కపిల స్మృతి, 11. పరాశర స్మృతి, 12. వ్యాస స్మృతి, 13. కాత్యాయన స్మృతి,   14. ఆపస్తంభ స్మృతి, 15. అశ్వలాయన స్మృతి, 16. కణ్వ స్మృతి, 17. అత్రి స్మృతి, 18. హరీత స్మృతి. ఇవి గాక శంఖ స్మృతి, మున్నగు స్మృతులు,   ఉప స్మృతులు కూడ ఉన్నాయి. ఈ స్మృతులననుసరించి కూర్చబడిన ధర్మశాస్త్ర గ్రంథాలు ఇవి. 01. హేమాద్రి, 02. నిర్ణయ సింధువు, 03. ధర్మ సింధువు, 04. ధర్మ ప్రవృత్తి, 05. స్మృతి రత్నాకరం, 06. స్మృతి రత్న మహోదధి, 07. స్మృతి చంద్రిక, 08. షట్కర్మ చంద్రిక, 09. యల్లాజీయము, 10. సుధీవిలోచనము మున్నగునవి.

ఆలయాల్లో మూలవిరాట్టుగాక ఇంకా అనేక విగ్రహాలను చూస్తున్నాం. అవన్నీ ఏమిటో, ఎందుకో వివరించండి

ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయాల్లో ఉన్న విగ్రహమూర్తులను "షడ్ బేరములు" అని అంటారు. అవి ధృవబేరము (మూర్తి), కౌతుక బేరము, స్నపన బేరము, బలిబేరము, యాత్రాబేరము, శయన బేరములు. గర్భగుడిలో ఉండే మూలవిరాట్టునే ధృవ (కదలిక లేని) బేరము అంటారు. ధృవ బేరం పరిపూర్ణ తేజస్సు కలిగి సకల కళాపూర్ణంగా ఉంటుంది. స్నపన బేరం నిత్యమూ అభిషేకానికి ఉపయోగిస్తారు. నివేదన అయిన తర్వాత, బలిహరణ్ నివేదనను ధ్వజ స్తంభం దగ్గర, బలిపీఠాల దగ్గర, పరివార దేవతలకు తప్పకుండా పెట్టాలి. అప్పుడు పల్లకీలో వెళ్ళే దేవుడిని బలిబేరం అంటారు. ఆలయంలో, గ్రామ వీధుల్లోను ఊరేగింపుగా తీసుకు వెళ్ళే విగ్రహమూర్తులను యాత్రాబేరం అంటారు. నిత్యమూ పవళింపు సేవ చేయడానికి వినియోగించే మూర్తిని శయన బేరం అంటారు. కౌతుకబేరాన్ని మధ్యవర్తిగా వినియోగిస్తారు. అంటే తిరుమంజనం (స్నానం) సమర్పించే ముందు ధృవ బేరంలోని కళాశక్తిని కౌతుక బేరం ద్వారా స్నపన బేరంలో ప్రవేశింపజేసి, ఆ ఉపచారం పూర్తి కాగానే ఆ శక్తిని తిరిగి కౌతుక బేరం ద్వారానే ధృవమూర్తిలోకి మారుస్తారు. ఇలాగే ఇతర ఉపచారాల్లో కూడ చేస్తారు. అయితే సాధారణంగా ఎంత చిన్న ఆలయంలో అయినా ధృవమూర్తి, ఉత్సవమూర్తులు తప్పక ఉంటారు.

దేవాలయంలోని పూజారులు పై వస్త్రాలను ధరించరు. ఎందుకని? కేవలం పంచె మాత్రమే ధరించటంలో ఉన్న ఆంతర్యం ఏమిటి?

 దేవుడి సన్నిధిలో ఆడంబరమైన వస్త్రధారణ చేయరాదని శాస్త్ర నియమం. సామాన్యంగా అర్చకులు పైన ధరించే ఉత్తరీయం అంచులు మొదలైన అలంకారాలతో కొంచెం ఆడంబరంగా ఉంటుంది. అది త్రిజగత్ ప్రభువైన దేవుడి దగ్గర వినయ ప్రవర్తనకు అనుకూలం కాదు. అందువల్ల పై ఉత్తరీయాన్ని నడుముకి చుట్టుకుని పూజాదులు చేయటం ఒక వినయ సంప్రదాయంగా ఏర్పడింది. ఇది దక్షిణ భారతంలో మరీ ఎక్కువ. చలి ఎక్కువగా ఉండే ఉత్తరదేశంలో ఈ ఆచారం లేదు. మన దేశంలో గూడా చలికాలంలో దేవ సన్నిధిలో ఉత్తరీయం ధరించవలసి వస్తే, దుప్పటి కప్పుకున్నట్లు కాక యజ్ఞోపవీతం వేసుకున్నట్లుగా, వల్లెవాటుగా, ఉత్తరీయాన్ని ధరించాలని ధర్మశాస్త్రాలలో ఉంది.

దానం మహత్త్వం: శుభఫలితాలకు మార్గం - ఆచరిద్దాము

 నదీ తీరంలో, కొండలపై, పుష్కరాల సమయంలో, దేవాలయాల దగ్గర బ్రహ్మోత్సవాల సమయాల్లో శాస్త్రోక్తంగా వస్త్ర, వస్తు, ధాన్య, ధన రూపేణా ఏదైనా దానం చేయడం చాలా పుణ్యప్రదం. సకల దోషాలు పరిహరింపబడతాయి, గృహంలో ధన, ధాన్య, ఆరోగ్య అభివృద్ధి లభిస్తుంది, సుఖ శాంతులు లభిస్తాయి, వాయిదా పడుతున్న పనులు పూర్తి అవుతాయి, శుభకార్యాలు జరుగుతాయి.

హృదయాన్ని విశాలంగా చేసుకునే శక్తి: త్యాగం ప్రేరణ - ఆచార్య ఆధ్యాత్మిక చింతన,

మనమంతా దివ్యమైన ఆత్మస్వరూపులమనే సహజ జ్ఞానం మనలోనే ఉన్నది. స్వార్థాన్ని విడిచి, ఫలితాలను గురించి భయాన్ని వదలి కార్యరంగంలోకి దుమికినప్పుడే ఘనతర కార్యసాధన జరుగుతుంది. పరిత్యాగం సంకుచితపు పరిధి నుండి విడుదలను ఇస్తుంది. మన సహజ స్వభావానికి వ్యతిరేకమైన వాటి నుండి తప్పిస్తుంది. పెను ప్రవాహం వచ్చినప్పుడు పిల్లకాలువలు తమ ఉనికిని కోల్పోతాయి కదా! అలాగే అల్ప విషయాలను తుడిచి వేయడం ద్వారా హృదయ వైశాల్యం విస్తరించి వీరోచిత కార్యాలకు ప్రేరణ కలుగుతుంది.

ప్రయాణమై బయలు దేరునప్పుడు ఎవరైనా తుమ్మితే ఏమి చేయాలి - ఆచరిద్దాము

ప్రయాణమై బయలు దేరునప్పుడు ఎవరైనా తుమ్మితే కాళ్ళు, చేతులు, ముఖం కడుక్కుని కూర్చుని దైవ ధ్యానం చేసుకుని, నోరు తీపి చేసుకుని వెళితే ఏ దోషం అంటదు. పనులు సానుకూలం అవుతాయి. శుభంభూయాత్.

ప్రదేశం మారితే లాభం లేదు. ఏ విషయంలోనైనా మారాల్సింది మనిషి బుద్ధే. - మంచిమాటలు

 ప్రదేశం మారితే లాభం లేదు. ఏ విషయంలోనైనా మారాల్సింది మనిషి బుద్ధే. దైవ ప్రార్థన ఏకాంతంగా చేయాలి. ప్రార్థన అనేది మెదడులోంచి కాక హృదయంలోంచి వస్తేనే అది టూ వే సంభాషణ అవుతుంది. అది దేవుడికీ, మనకు సంబంధించినది తప్ప, మనకు ప్రపంచంలోని ఇతరులకి సంబంధించినది కాదు. శిక్ష పడుతుందన్న భయంతో కానీ, బహుమతి లభిస్తుందన్న ఆశతో కానీ దేవుడ్ని కొలవడం తప్పు. దేవుడ్ని చేరుకోవడానికి మాత్రమే కొలవాలి. ఆధ్యాత్మిక వివేచనతో మేలైన వివేకం అలవరచుకుంటే ఆటవికులు కూడా జ్ఞానులైన యోగులవుతారు. స్పష్టమైన జ్ఞాన నియంత్రణలో ఇంద్రియాలు సులువుగా, ఆనందంగా మన అధీనంలోకి వస్తాయి. అప్పుడు మనకు ప్రతిగా కాక మనకు అనుకూలంగా ప్రవర్తిస్తాయి. విలువలే మన ప్రవర్తనకు పునాదిరాళ్ళు. మన సంస్కృతికి సమగ్ర భాగస్థులు. మన విలువలు దృఢంగా ఉంటే మనకు తప్పు, ఒప్పులు సులువుగా తెలుస్తాయి. తదనుగుణంగా మనం క్రియాత్మకులం కావచ్చు.